యుక్రెయిన్కు ప్రపంచదేశాల వెన్నుపోటు పొడిచాయి. నమ్మించి నట్టేట ముంచారని యుక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచం తమను ఒంటరిని చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని ఏ సాయం అడిగినా ఎవరూ స్పందించడం లేదని ఆయన వాపోతున్నారు. చివరకు ప్రజలే రష్యాను ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
మందుగుండు అడిగితే మంచినీళ్లు, బిస్కట్లు పంపిస్తున్న దేశాలతో యుక్రెయిన్ షాక్లోకి జారుకుంది. సైనిక సాయం అడిగితే ప్రపంచ దేశాలు కుంటిసాకులు చెబుతున్నాయి. రష్యాను కట్టడి చేయాల్సింది పోయి ఆంక్షలతో సరిపెట్టాయి.ఓవైపు రష్యా దళాలు ముందుకు దూసుకొస్తున్నాయి. మరోవైపు తమ సైనికులు వెనకడుగు వేస్తున్నారు. రాజధాని కీవ్లోనూ రష్యా సైన్యం ప్రవేశించింది. ఎయిర్పోర్ట్ చేయిజారిపోయింది. ఈ దశలో నాటో దేశాలు ఏదో రూపంలో సాయం చేస్తాయని భావిస్తే ఎవరూ ఇప్పుడు స్పందించడం లేదు. మేమున్నాం నీకెందుకంటూ యుక్రెయిన్ను ముందుకు తోసిన దేశాలు ఇప్పుడు జారుకున్నాయి. రష్యా చేసింది తప్పంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ఒక్క దేశం కూడా సైనిక సాయానికి ముందుకు రావడం లేదు.