పార్వతీపురం, సెప్టెంబర్ 15 : తెలుగు భాషను పాలనా భాషగా ఉపయోగించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. అందరూ తెలుగు భాష లో మాట్లాడటమే కాకుండా, పాలనా భాషగా ఉపయోగించని తెలిపారు. అట్లు ఉపయోగించని వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వం కల్పించిందని ఆయన చెప్పారు. అధికార భాషా సంఘం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తెలుగు భాష అమలు పై గురువారం సమీక్షించింది. సంఘం అధ్యక్షులు డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తెలుగు అకాడమీని, అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించారని చెప్పారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయుటకు ముఖ్య మంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకొని సాహసోపతంగా ప్రభుత్వ ఉత్తర్వలు విడుదల చేశారని చెప్పారు. ఈ ఉత్తర్వులు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రాచీన భాషా హోదాను వై యస్. రాజశేఖర రెడ్డి సంపాదించారని ఆయన గుర్తుచేశారు. ప్రాచీన భాషా అధ్యయన కేంద్రంను రాష్ట్రానికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని తెలిపారు. ఆత్మన్యూనత వదిలి మన భాషకు ప్రాధా న్యత ఇవ్వాలని ఆయన ఉద్బోధించారు. గొప్ప వారసత్వ సంపద కలిగిన మృదు మధుర భాష తెలుగు అని అన్నారు. పాలనా భాషగా చేయుటకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగిందని తెలిపారు.
పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాధ్యమైనంత వరకూ చేస్తున్నామని తెలిపారు. తెలుగు భాష అమలుకు, అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, డీఎస్పీలు ఏ.సుభాష్, శ్రావణి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, అధికార భాషా సంఘం కార్యదర్శి రామ్ గోపాల్, ప్రాజెక్టు అధికారి డా. సి.సత్యలత, డా.వి. సరోజిని, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.