విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆందోళనల పర్వం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు వరకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్లోనూ పోరాడతామని తెలిపారు. ‘విశాఖ ఉక్కుని ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేసారు. ప్రైవేటీకరణ చేయకూడదనే వైకాపా విధివిధానమని దీన్ని అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైకాపా ఒప్పుకోదని లేదంటే పోరాటాన్ని అలాగే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కును సాధించినప్పుడు పోరాటం రాష్ట్రంతో పాటు ఢిల్లీలో కూడా జరిగిందని గుర్తుచేశారు. అదే తరహాలో పోరాటం చేస్తే అనుకున్నది సాధిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఒప్పుకోమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేసారు. ఇటీవల విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి కార్మిక సంఘాలను కలిసినప్పుడు ఇదే విషయాన్నీ స్పష్టం చేసారని తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ మేము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. పార్లమెంటు లోపల, బయటా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అవసరమైన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యేలు అమర్నాధ్, ధర్మశ్రీ మరియు బాబు రావులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ......... విజయసాయి పాదయాత్ర
February 20, 2021
0
Tags
