మీడియా పవర్, నెల్లూరు, సెప్టెంబర్ 12 : గిరిజనులకు భగవంతుడిని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎస్సీ,ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం వెంకటాచలం మండలం కసుమూరు గ్రామం శ్రీనివాస ఎస్టీ కాలనీలో టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో ఆలయాలను నిర్మించి, గిరిజనులకే పూజా విధానాలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి పూజారులుగా నియమించి, గిరిజనులే ఆ గుడి బాగోగులు చూసుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా టిటిడి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1342 ఆలయాలను ఎంపిక చేయగా 111 ఆలయాలను మొదటి విడతగా నిర్మించనున్నట్టు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గానికి 11 ఆలయాలను టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేసి మంజూరు చేయించామని, మొదటగా మల్లికార్జున పురం, కసుమూరులో ఆలయాల నిర్మాణ పనులకు భూమి పూజ చేసామన్నారు. ప్రాధాన్యత క్రమంలో గిరిజన కాలనీలను గుర్తించి దేవాలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 60 ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఒక్కొక్క ఆలయానికి నెలకు ఐదు వేల రూపాయలను ఇస్తుండగా, మరో 110 ఆలయాలను ఈ పథకం కింద గుర్తించామని, మొత్తం జిల్లాలో 170 ఆలయాలకు దూప దీప నైవేద్యానికి రూ. 5,000 నుంచి రూ 10,000 కు పెంచి ప్రతి నెలా ఇవ్వనున్నట్లు చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆలయాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు ధ్రువీకరణపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ కోట సునీల్ కుమార్ స్వామి, రాష్ట్ర సంయోజక్ కొండారెడ్డి, ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, తాసిర్దార్ నాగరాజు, ఎంపీపీ కవిత, సర్పంచ్ కడివేటి శివ, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మూలం : జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, నెల్లూరు
