విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు రెండు నెలల్లోనే పరిష్కార మార్గం చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అక్టోబర్ ఒకటి నుంచి పీఆర్సీతో కలిపి జీతాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, దీనిపై క్యాబినెట్లో ప్రతిపాదన పెట్టాలని సబ్ కమిటీ సభ్యులకు సీఎం జగన్ సూచించారని బొత్స తెలిపారు. విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో పాల్గొన్న మంత్రి బొత్స ప్రసంగించారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, అది కూడా రెండు నెలల్లోనే అని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. 2003, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సీపీఎస్, ఓపీఎస్ రెండింటిలో ఏదో ఒకటి వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై నెలరోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. తన శాఖలో టీచర్లు మొదలుకుని ప్రొఫెసర్ల వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.